ఏపిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం బలవన్మరణం కేసు విషయంపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితులైన సీఐ, హెడ్ కానిస్టేబుళ్లకు వెంటనే బెయిల్ రావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఘటనను పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం మౌలానా అబ్దుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ టీడీపీ నేతల తీరును విమర్శించారు. నంద్యాల ఘటన చాలా బాధాకరమన్న వైఎస్ జగన్.. ఈ ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే చట్టబద్దంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. తప్పు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నంద్యాల ఘటనలో పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరపున బెయిల్ పిటిషన్ వేసి న్యాయస్థానం నుండి బెయిల్ మంజూరు చేయించారన్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి బెయిల్ రద్దు చేయాలని తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు చెప్పారు. మంచి చేయాలని తాము ఆలోచిస్తుంటే..ఎలా బురద చల్లాలని చంద్రబాబు చూస్తున్నారని జగన్ విమర్శించారు. వారి పార్టీకి చెందిన లాయర్ బెయిల్ తీసుకువస్తారు..నిందను ప్రభుత్వం వేస్తారు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అన్నారు వైఎస్ జగన్. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు.
నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఈ నెల 3వ తేదీన గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తనపై అన్యాయంగా దొంగతనం కేసు బనాయించి పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యకు ముందు అబ్దుల్ సలాం తీసిన సెల్ఫీ వీడియో బయటకు రావడంతో సీఐ సోమశేఖరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లను సస్పెండ్ చేశారు. ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చగా సోమవారం వారు బెయిల్ పై విడుదల అయ్యారు. పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ తో అరెస్టు చేసినప్పటికీ నిందితుల తరపు న్యాయవాదులు నాన్ బెయిలబుల్ సెక్షన్ వర్తించదంటూ కోర్టులో వాదనలు వినిపించారు. ఆ తరువాత నాన్ బెయిలబుల్ సెక్షన్ను తొలగింపజేయడంతో మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ తరుణంలో బెయిల్ పిటిషన్పై వాదనల సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది సరిగా వాదించలేదనీ, అందుకే బెయిల్ వచ్చిందని దీనిలో స్థానిక అధికార పార్టీ నేతల హస్తం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్ నేరుగా స్పందించి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.