ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సారి హస్తినకు బయలుదేరి వెళుతున్నారు. ఈ రోజు రాత్రి గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరతారు. రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో బస చేస్తారు. రేపు (సోమవారం) ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. కొద్ది రోజుల క్రితం నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సీఎం జగన్ .. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. అయితే ఇప్పుడు మరో సారి ప్రధాని తో సమావేశం అయ్యేందుకు జగన్ వెళుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకొంది.
రీసెంటర్ గా గోదావరి వరద బాధితుల పరామర్శకు వెళ్లిన సమయంలో వరద బాధితుల సహాయం, పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వివరిస్తామని చెప్పారు. భారీ మొత్తం నిధులు కావాల్సి ఉన్నందున కేంద్ర సహకారం తప్పదని జగన్ పేర్కొన్నారు.ప్రధానితో జరిగే కీలక భేటీలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, నిర్వాసితుల సమస్య, వరద సహాయం తదితర అంశాలపై చర్చించడంతో పాటు విభజన చట్టంలోని పెండింగ్ అంశాల అమలు చేయాలని కోరతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ సమావేశం అయి రాష్ట్రానికి సంబంధించి అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీ టూర్ లో భాగంగా నూతనంగా రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము. ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ లను మర్యాదపూర్వకంగా కలవనున్నారని సమాచారం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.