AP CM YS Jagan: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్యలో అన్ని రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వివిధ రాజకీయ పక్షాల డిమాండ్ నేపథ్యంలో సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా పదవ తరగతి పరీక్షలను రద్దు చేశారు. ఒడిస్సా, తమిళనాడు రాష్ట్రాలలో కూడా పదవ తరగతి పరీక్షలను రద్దు చేశాయి.
ఈ నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన నేడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు నిన్న ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల మాదిరిగానే పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సీఎం నిర్ణయానికి ఎదురుచూపులు చూశారు. అయితే ఇదే సందర్భంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయడమో లేక వాయిదా వేయడమో చేయాలంటూ సీఎం వైఎస్ జగన్ కు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ నాయకులు ఎవ్వరూ దీనిపై ముఖ్యమంత్రి జగన్ కు ఎటువంటి సూచనలను బహిరంగంగా చేయలేదు. దీంతో నేడు జరిగిన హైలెవల్ సమావేశంలో విద్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కరోనా పరిస్థితులపై సమీక్ష జరిపిన సీఎం వైఎస్ జగన్ పరీక్షల నిర్వహణలపై వెనుకడుగు వేయలేదు. షెడ్యుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయానికే వచ్చేశారు. ఒకటవ తరగతి నుండి 9వ తరగతి వరకూ సెలవులు ఇచ్చేశారు.
ఈ విషయాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించడంతో రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. లోకేష్ లేఖ రాయడం వల్ల జగన్ పరీక్షల రద్దు లేక వాయిదా విషయంలో ఇతర రాష్ట్రాలకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారేమో అన్న చర్చ రాష్ట్రంలో జరుగుతుంది. ఒక వేళ పరీక్షలు రద్దు చేసినా, వాయిదా వేసినా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు లోకేష్ విజ్ఞప్తిని గౌరవించినట్లు అవుతుందని భావించే ఆ ప్రతిపాదన పక్కన పెట్టారేమో అన్న మాట కూడా వినబడుతోంది. రాష్ట్రంలో పరిస్థితులను వైసీపీ నాయకులు ఎవరైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వివరించి పదవ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరితే నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాలి మరి.