RIMS: పేద, మధ్య తరగతి వర్గాలు వైద్య పరీక్షల్లో సిటీ స్కామ్, ఎంఆర్ఐ స్కాన్ లు చేయించుకోవాలంటే తమ శక్తికి మంచి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలన్న ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో భాగంగా నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్ లను బుధవారం సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీంతో ఈ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో నిర్వహించే పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఈ యంత్రాలు సత్వర వైద్యానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి ఈ యంత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించడం వల్ల క్షణాల్లో ఫలితాలు వస్తాయి. వైరస్ నిర్ధారణ అయితే వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుని వైద్య సేవలు అందించే పరిస్థితి ఉంటుంది. దీంతో ఆ పేషంట్ నుండి మరి కొందరికి వైరస్ స్పెడ్ అవ్వకుండా నిరోధించే అవకాశం కూడా ఏర్పడుతుంది. ప్రస్తుతం కోవిడ్ పరీక్షల నివేదికలు రావడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుండటంతో పరీక్షలు చేయించుకున్న వారు అప్పటి వరకూ బయట తిరుగుతుండటంతో వారి నుండి ఇతరులకు వైరస్ సోకుతున్నది.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. పేద వాడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 బోధనా ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయనీ, మరో 16 బోధనా ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని జగన్ పేర్కొన్నారు. వీటన్నింటినీ ఆరోగ్య శ్రీ కిందకు తీసుకువస్తామని పేర్కొన్నారు.