AP CM YS Jagan: ఏపిలో అమలు అవుతున్న కర్ప్యూపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 20 తర్వాత సండలింపులు ఇస్తూ కర్ఫ్యూ కొనసాగుతుందని బుధవారం జరిగిన స్పందన సమీక్షలో సీఎం జగన్ పేర్కొన్నారు. మే 5వ తేదీ నుండి విధిస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలు ఇచ్చిందన్న సీఎం జగన్..20వ తేదీ తరువాత సడలింపులు ఇస్తూ కర్ఫ్యూను మరి కొన్ని రోజులు కొనసాగించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యల్లో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. కేసుల సంఖ్య తగ్గుతుండటంతో పాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని అన్నారు.
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇప్పటి వరకూ మూడున్నర కోట్ల మందిలో 69లక్షల మందికి సింగిల్ డోస్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 26,33,351 మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. 89 శాతం కోవిడ్ బాధితులను ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు.
Read More: AP Government: రాజధాని రైతులకు వార్షిక కౌలు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
కాగా ఈ నెల 22న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనికి గానూ కలెక్టర్ లు అంతా సిద్ధం కావాలని ఆదేశించారు. అదే విధంగా వచ్చే నెలలో విద్యా దీవెన, కాపు నేస్తం పథకాలు అమలు చేస్తామని పేర్కొన్న వై ఎస్ జగన్ జూలై 1న వైఎస్ఆర్ భీమా పథకం ప్రారంభం అవుతుందని తెలిపారు.