ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన వైఎస్ జగన్ అయదు గంటల ప్రాంతంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం కానున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో వరదలు, తుఫాను కారణంగా జరిగిన నష్టంపై వరద సహాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించేలా సహకరించాలని అమిత్షాకు జగన్ కోరనున్నారు. వీటితో పాటు రాష్ట్ర విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి చెందిన ఇతర అంశాలపైనా అమిత్ షాకు జగన్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ వెంట ఎంపిలు విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలపై ఇటీవలే రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్, అనిల్ కుమార్ యాదవ్లు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన రెండు రోజుల వ్యవధిలోనే ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి హస్తిన పర్యటనకు వెళ్లడం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకోంది. అయితే కెసిఆర్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో ప్రతిపక్షాలు ఆయనపై ఆరోపణలు, విమర్శలు చేసిన విధంగానే ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ఏపికి చెందిన ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు.