AP CM YS Jagan Odessa Tour: ఏపి (Andhra Pradesh) సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (YS Jagan mohan Reddy) మంగళవారం భువనేశ్వర్ (ఒడిశా) వెళుతున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఉమ్మడి రాష్ట్ర పరిధిలోని పలు కీలక అంశాలపై సమీక్ష జరిపేందుకు సీఎం జగన్ వెళుతున్నారు. ప్రధానంగా మూడు అంశాలపై ఒడిశా సీఎం పట్నాయక్ తో జగన్ చర్చించనున్నారు. వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝూవతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలను చర్చించనున్నారు. ఒడిశాతో చర్చల నేపథ్యంలో సీఎం జగన్ సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతో మూడు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
AP CM YS Jagan Odessa Tour: వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం
వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల ఉభయ రాష్ట్రాలకు కలగనున్న ప్రయోజనాలను సీఎం జగన్ వివరించనున్నారు. బ్యారేజ్ నిర్మాణానికి ఒడిశా వైపు నుండి 103 ఎకరాలు అవసరమని, అందులో 67 ఎకరాలు రివర్ బెడ్ ప్రాంతమేనని అధికారులు తెలిపారు. బ్యారేజ్ నిర్మాణంతో ఒడిశా వైపు కూడా సుమారు అయిదు ఆరు వేల ఎకరాలకు తక్షణం సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. ఇక జంఝూవతి ప్రాజెక్టు అంశానికి సంబంధించి ప్రస్తుతం రబ్బర్ డ్యాం ఆధారంగా సాగునీరు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. 24,640 ఎకరాల విస్తీర్ణానికి గానూ కేవలం 5వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామనీ, ప్రాజెక్టు పూర్తి చేస్తే రైతులకు పూర్తి స్థాయిలో మేలు జరుగుతుందని వివరించారు. ప్రాజెక్టు ను పూర్తి చేస్తే ఒడిశాలో నాలుగు గ్రామాలు పూర్తిగా, ఆరు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురి అవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఒడిశాలో దాదాపు 1174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందనీ, అందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేననీ అధికారులు వివరించారు. ఈ మేరకు ఆర్ అండ్ ఆర్ కు సహకరించాలని ఒడిశాను ఏపి కోరనున్నది.
కొఠియా గ్రామాల వివాదం
ఏపి, ఒడిశా సరిహద్దులో ఉన్న 21 కొఠియా గ్రామాల వివాదం ఎప్పటి నుండో ఉంది. ఈ గ్రామాలకు సంబంధించి వివాదం సుప్రీం కోర్టులోనూ నడుస్తోంది. విజయనగరం జిల్లా సరిహద్దులో ఈ గ్రామాల్లో అటు ఒడిశా ప్రభుత్వం, ఇటు ఏపి ప్రభుత్వం సేవలు అందిస్తున్నాయి. కొఠియా గ్రామాల్లో దాదాపు 87 శాతానికిపైగా గిరిజనులు ఉన్నారు. వీరికి సేవలు అందించే విషయంలో తరచు అటు ఒడిశా, ఇటు ఏపి అధికారుల మధ్య తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కొఠియా గ్రామాల్లో జరిగిన పరిణామాలను అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. 21 గ్రామాల్లో 16 గ్రామాలు ఏపిలోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి సీఎంకు వివరించారు. ఇటీవల ఆయా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు.