(విజయవాడ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం మూలా నక్షత్రం రోజు సాయంత్రం విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలను సమర్పించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీఎం వైఎస్ జగన్ దుర్గగుడికి చేరుకోగా వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ముందుగా ఇంద్రకీలాద్రి కొండపై విరిగిపడిన కొండచరియల ప్రాంతాన్ని సీఎం జగన్ పరిశీలించారు. సహాయ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టువస్త్రాలతో పంచెకట్టు, తలపాగా చుట్టి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు.
దుర్గగుడి ఆలయ అభివృద్ధికి రూ.70కోట్లు
ఈ సందర్భంగా సీఎం జగన్ దుర్గ గుడి ఆలయ అభివృద్ధికి నిధులను మంజూరు చేశారు. లడ్డూపోటు, ఘాట్ రోడ్డు అభివృద్ధి, సోలార్ సిస్టమ్ తో పాటు ఇతర అభివృద్ధి పనులకు సీఎం జగన్ రూ.70కోట్లు మంజూరు చేసినట్లు ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ వెంట మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి, వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు.