AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అభిమానులకు సీఎం జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వీళ్లందరూ ఎంత బాగా తెలుసో, ఎంత బాగా ఫేమసో ప్రశాంత్ కిషోర్ (పీకే) కూడా అంతే తెలుసు. అంతే ఫేమస్సు. ఎక్కడో బీహార్ లో పుట్టి, ఎక్కడో ఢిల్లీ వేదికగా సంస్థ నడుపుతున్నప్పటికీ ఆయన రాజకీయ వ్యూహాకర్తగా ఏపిలో అంతగా ముద్ర వేసుకున్నారు. అటువంటి ప్రశాంత్ కిషోర్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు కానీ పీకే టీమ్ ఫలానా జిల్లాలో అడుగు పెడుతుంది అంటే అక్కడ వైసీపీలో అంతర్గతంగా ఏదో జరుగుతున్నట్లే అర్ధం చేసుకోవాలి. నూటికి నూరు శాతం అక్కడ మార్పులు జరుగుతున్నట్లేనని అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీమ్ విశాఖపట్నంలో మకాం వేసింది. మూడు రోజుల నుండీ అక్కడే ఉంది. ఇదేమిటి విశాఖపట్టణానికి పీకే టీమ్ ఎందుకు వెళ్లింది ? అక్కడ ఏమి మార్పులు జరగబోతున్నాయి ? అన్న సందేహంతో అక్కడ పరిస్థితులను సమీక్షించగా విశాఖలో వైసీపీ కాస్త బలహీన పడింది అన్న మాటలు వినబడుతున్నాయి. బలహీనపడటం అంటే వాళ్లకు రావాల్సిన బలం రాలేదు అన్న భావనతో పార్టీ ఉందట. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని సరి చేసుకోవాలంటే ఏమి చేయాలి ? అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధుల్లో ఎవరెవరిపై అసంతృప్తి ఉంది అనే విషయాలను తెలసుకునేందుకు పీకే టీమ్ అక్కడ ఎంటర్ అయ్యింది.
AP CM YS Jagan: విశాఖలో ఓటింగ్ శాతంలో వెనుకబడ్డ వైసీపీ
ఏడు ఎనిమిది నెలల క్రితం విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే విశాఖలో అత్యధిక డివిజన్లలో వైసీపీ గెలిచి మేయర్ స్థానాన్ని కైవశం చేసుకున్నప్పటికీ ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ప్రతిపక్షాల కంటే తక్కువగానే ఓట్లు వచ్చాయి. నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ లో వైసీపీకి 49 శాతం ఓట్లు పోల్ కాగా టీడీపీ, జనసేన, బీజేపి లకు కలిపి 51 శాతం ఓట్లు వచ్చాయి. అంటే విపక్షాల కంటే అధికార పక్షానికి తక్కువ ఓట్లే వచ్చాయి. సీట్లు ఎక్కువ, మేయర్ స్థానం వచ్చినప్పటికీ ఓటింగ్ శాతం పరిశీలించినట్లయితే ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత ఉన్నట్లుగా పార్టీ భావిస్తున్నది. రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో గానీ కార్పోరేషన్ లో గానీ ఈ పరిస్థితి లేదు. విశాఖపట్నంలోనే ఈ పరిస్థితి ఉంది. విశాఖపట్నంలో వైసీపీ బలపడాలని అనుకుంటుంది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుని సీఎం జగన్మోహనరెడ్డి పరిపాలన సాగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అక్కడ తతంగాలు నడుపుతున్నారు. కానీ వైసీపీ రావాల్సిన బలం రాలేదు. దీనికి కారణం ఏమిటి అనే తెలుసుకునే ప్రయత్నంలో పార్టీ ఉంది.
స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో వైసీపీ వెనుకంజ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంది కానీ కార్మికుల పక్షాన నిలబడి పోరాటం సాగించిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించడం లేదన్న మాట వినబడుతోంది. విశాఖలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు పెద్దగా కార్మికుల ఆందోళనలో పాల్గొనడం లేదు. ఇది ఒక కారణం కాగా పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత విశాఖపట్టణానికి ప్రభుత్వం చేసింది ఏమిలేదనే విమర్శ ఉంది. రాజధాని అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్న నేపథ్యంలో విశాఖ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు పెద్ద పరిశ్రమల ఏర్పాటుకైనా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. పరిపాలనా రాజధానిగా కోర్టు ఒప్పుకుంటేనే విశాఖలో పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెడతారా అప్పటి వరకూ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయరా అని అక్కడి వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి విశాఖపట్నంపై ప్రేమ, నిజాయితీ ఉంటే కంపెనీలు, ఫ్యాక్టరీలు తీసుకువచ్చి అభివృద్ధి చేయవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.
విశాఖలో పీకే టీమ్ సర్వే
ఈ అంశంతో పాటు విశాఖపట్నంలో భూ అక్రమాల దందా కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మూడు కారణాల వల్ల విశాఖ ప్రజానీకం వైసీపీ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారని పార్టీ పెద్దలు కూడా గ్రహించారు. అందుకే పీకే టీమ్ ద్వారా అక్కడ పరిస్థితులపై సమీక్ష జరుపుతోంది, అక్కడ పరిస్థితులు మారడానికి, పార్టీ బలోపేతం కావడానికి అక్కడ నాయకులను ఎవరెవరిని మార్పు చేయాలి ? ఎవరెవరిని తప్పించాలి ? అక్కడ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న నాయకుడిని మార్చి వేరే నాయకుడిని పెట్టాలా ? విశాఖలో వైసీపీ బలపడాలంటే ఏమి చేయాలి ? అని కనిపెట్టే పనిలో పీకే టీమ్ అక్కడ అడుగు పెట్టింది. మరో వారం రోజుల పాటు అక్కడే ఉండి సర్వే చేస్తుంది. అక్కడ ఎమ్మెల్యే, ఎంపీలతోనూ ఈ టీమ్ ముఖా ముఖి చర్చలు జరపడంతో పాటు క్షేత్ర స్థాయి పరిస్థితులనూ పరిశీలించి పార్టీ అధిష్టానానికి ఒక నివేదక అందజేయనుంది. పీకే టీమ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తాడేపల్లిలో సీఎం జగన్ మార్పులు చేర్పులపై దృష్టి పెట్టనున్నారు.