(తిరుపతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి కొద్ది సేపటి క్రితం తిరుమల శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పంచెకట్టు, తిరునామంతో సీఎం వై ఎస్ జగన్ స్వామివారిని దర్శించుకున్నారు.
తొలుత తిరుమల చేరుకున్న సి ఎం వై ఎస్ జగన్కు పద్మావతి అతిధి గృహం వద్ద టీటీడీ చైర్మన్ వైవి సుబ్బా రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వైఎస్ జగన్కు తలపాగా చుట్టి పట్టువస్త్రాలు శిరస్సుపై ఉంచారు. తదుపరి జగన్ ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్.. శ్రీనివాసుడి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు.
ముందుగా ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడి నుండి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆర్ కె రోజా తదితరులు స్వాగతం పలికారు. స్వామివారి గరుడ వాహన సేవలో సీఎం వైఎస్ జగన్ తో పాటు ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాసు, మేకతోటి సుచరిత, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.