ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా విపత్తు సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద 1,168 కోట్ల రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే. రిస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా మే నెలలో 450 కోట్ల రూపాయలు విడుదల చేయగా, నేడు రెండవ విడత 512 కోట్ల రూపాయలను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చిన్న పరిశ్రమలకు రాయితీలుగా ఇవ్వాల్సిన 800 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టినా, తమ ప్రభుత్వం వాటినీ చెల్లించిందని చెప్పారు. చిన్న పరిశ్రమలకు చేయూత నిస్తేనే వారి కాళ్లమీద వాళ్లు నిలబడటంతో పాటు మరి కొంత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని అన్నారు. కరోనా కష్ట కాలంలో పరిశ్రమలు నడపలేని పరిస్థితుల్లో వెసులు బాటు ఇచ్చేందుకు గాను ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో కరెంటు ఫిక్స్డ్ ఛార్జీలు 180 కోట్ల రూపాయలు కూడా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో 200 కోట్ల రూపాయలను తక్కువ వడ్డీతో ఏపీఎస్ఎఫ్సీ ద్వారా పెట్టుబడి రుణాలను అందిస్తున్నామని జగన్ వెల్లడించారు. ఈ రుణాలకు ఆరు నెలల మారటోరియంతో పాటు మూడేళ్ల కాలపరిమితిలో చెల్లించే అవకాశం ఉంటుందన్నారు.
ఎంఎస్ఈలకు సంబంధించి బాగోగులు చూసేందుకు ప్రతేకంగా ఒక జేసిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన జగన్.. పనుల కోసం అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఇక రాదన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి 25 శాతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ తెలిపారు. స్పిన్నింగ్ మిల్లులకు సబంధించిన వెయ్యి కోట్ల రూపాయల బకాయిలను వచ్చే ఏడాదిలో చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.