(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాష్ట్రంలోని 14లక్షల 58వేల మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.510కోట్లు జమ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఈ పథకాన్ని మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వర్చువల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నామన్నారు. అక్టోబర్ నెలలో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేసినట్లు చెప్పారు. నెల రోజుల్లోపే 132 కోట్ల రూపాయలు ఇన్ పుట్ సబ్సిడీ కింద విడుదల చేస్తున్నామని తెలిపారు. రైతాంగానికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు. 18 నెలల కాలంలో 90శాతంకు పైగా హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు. రుణ మాఫీ వాగ్దానాన్ని ఎలా అటకెక్కించారో గత ప్రభుత్వంలో చూశామన్నారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీపై పెట్టిన 1180 కోట్ల రూపాయల బకాయిలన్నీ ఈ ప్రభుత్వం చెల్లించిందన్నారు.
అర్హత ఉండి ఇన్ పుట్ సబ్సిడీ అందని రైతులు ఎవరైనా ఉంటే మళ్లీ ధరఖాస్తు చేసుకోవచ్చని జగన్ తెలిపారు. రైతుల వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు వేయిస్తామని చెప్పారు. పంటల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,200 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ఈ నెల 26న ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలలో మొదటి విడత పాలసేకరణలో భాగంగా బల్క్ మిల్క్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.