ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుండి గన్నవరం బయలుదేరారు. అవసరమైతే ఈ రాత్రి కూడా ఢిల్లీలో బస చేసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా మరి కొందరు కేంద్ర మంత్రులతో భేటీ అయి తిరుగు ప్రయాణం అవుతారు అని ముందుగా ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రధాని మోడీ తో భేటీ అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తదుపరి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో సమావేశమైయ్యారు. ఆయనతో దాదాపు అరగంట పాటు భేటీ కొనసాగింది. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ నుండి ఏపికి రావాల్సిన ఆరు వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలపై చర్చించినట్లు సమాచారం.
విద్యుత్ శాఖ మంత్రితో భేటీ ముగిసిన అనంతరం ఢిల్లీ నుండి గన్నవరం బయలుదేరారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, నిర్మలా సీతారామన్ తదితర కీలక మంత్రులతో సమావేశం కాకుండానే జగన్ తిరుగు ప్రయాణం అయ్యారు. ముందు షెడ్యుల్ ప్రకారం ప్రధాని మోడీ, రాష్ట్రపతి, విద్యుత్ శాఖ మంత్రుల అపాయింట్మెంట్ లు ఖరారు కావడంతో వీరితో భేటీలు ముగిసిన వెంటనే ఏపికి బయలుదేరారు. ఈ నెల లోనే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సమయంలో ప్రధాని మోడీ ని కలిశారు సీఎం జగన్. ప్రస్తుతం మోడీకి విజ్ఞప్తి చేసిన అంశాలపైనే ఇంతకు ముందు జగన్ వినతి పత్రాన్ని అందించారు. ఇప్పుడు మరో సారి ప్రధాని మోడీతో జగన్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అధికార హోదాలో ఏపికి విచ్చేస్తున్న పలువురు కేంద్ర మంత్రులు ఏపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు కేంద్ర మంత్రులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనపై గతంలో ఎన్నడూ లేని విధంగా విమర్శలు చేస్తున్నారు. ఏపి బీజేపీ నేతలు జగన్మోహనరెడ్డి సర్కార్ పై విమర్శలు చేస్తున్నా కేంద్రంలోని బీజేపీకి అన్ని విధాలుగా వైసీపీ సహకరిస్తూనే ఉంది.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వైసీపీ .. ఎన్డీఏకి మద్దతు ఇచ్చింది. అంతకు ముందు రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదంలోనూ వైసీపీ సహకరిస్తూనే ఉంది. అయితే రీసెంట్ గా ఏపికి విచ్చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ .. జగన్మోహనరెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే హుటాహుటిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి పయనమై వెళ్లారు. మోడీతో భేటీ అయ్యారు. ఈ పరిణామంతో అయినా కేంద్ర మంత్రుల దూకుడు వ్యాఖ్యలు తగ్గుతాయేమో వేచి చూడాలి. అనురాగ్ ఠాగూర్ వ్యాఖ్యలకు ఏపి మంత్రులు కౌంటర్ ఇచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీకి అసలు కారణం అదేనంట.. ఏపి మాజీ మంత్రి కొడాలి నాని స్పందన ఇది