(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణానదికి భారీగా వరద పోటెత్తుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పది మంది వరకూ మృతి చెందారు. వేలాది ఎకరాలు వరద ముంపునకు గురి అయ్యింది. చెరువులకు గండ్లు పడ్డాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు అధికారులు తరలించారు. పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భారీ వర్షాలు, సహాయ చర్యలపై నేడు అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రులు మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తదితరులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు.
ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ పనులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేయాలనీ, పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు సాయం అందించాలని ఆదేశించారు. వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలనీ, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. శ్రీశైలం నుండి నాలుగు లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు విడుదల అవుతోందనీ, మరో రెండు రోజుల్లో ప్రకాశం బ్యారేజీ వద్దకు ఏడులక్షలకు పైగా వరద వచ్చే అవుతున్నందున ఏ పరిస్థితులు ఎదురైనా ఎదుర్కునే విధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరివాహన ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి వారికి వసతి కల్పించాలన్నారు. వివిధ జిల్లాలలో మృతి చెందిన పది మంది కుటుంబాలకు తక్షణం పరిహారం చెల్లించే ఏర్పాట్లు చేయాలని, పంట నష్టంపై వారం రోజుల్లోగా అంచనాలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు సీఎం జగన్. సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.