అమరావతి: వరద బాధితులకు ఉదారంగా సహాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. విదేశీ పర్యటనను ముగించుకొని తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న సిఎం జగన్ సోమవారం గోదావరి వరదలు, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. నిత్యావసర వస్తువుల పంపిణీ విషయలో ఆలస్యం చేయవద్దని మరో సారి స్పష్టం చేశారు.
ధవళేశ్వరం వద్ద 2,3 ప్రమాద స్థాయి హెచ్చరికలు దాటినప్పుడే దేవీపట్నం మండలంలోని గ్రామాలు ముంపునకు గురవుతాయని, ఇప్పుడు ఒకటో ప్రమాద స్థాయికి చేరక ముందే ముంపునకు గురయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనికి గల కారణాలను అధ్యయనం చేయాలనీ, తర్వాత తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గడచిన ఐదు ఆరు రోజుల్లోనే 500 టిఎంసిల జలాలు గోదావరి నది ద్వారా సముద్రంలోకి కలిసిపోయినట్టుగా అంచనా వేశామని అధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజుల పాటు మొదటి ప్రమాద స్థాయి హెచ్చరిక కొనసాగే అవకాశాలున్నాయని, మేడిగడ్డ వద్ద ప్రాణహిత నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు అదనంగా వస్తుండటం వల్ల ఈ పరిస్థితి ఉందని వివరించారు.
వరద బాధిత ప్రాంతాల్లో సంబంధిత మంత్రులు పర్యటించాలని సిఎం పునరుద్ఘాటించారు. సకాలంలో సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంటు వ్యాధులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనీ, పశు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. తాగు నీటికి ఎలాంటి కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షలో హోం మంత్రి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.