డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనవర్శిటీ పేరు మార్పు అంశాన్ని వ్యతిరేకిస్తూ ఏపి అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేసి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. హైల్త్ యూనివర్శిటీ పేరు మార్చే బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్..వైఎస్ఆర్ పేరు ఎందుకు నామకరణం చేయాల్సి వచ్చిందో వివరించారు. ఎన్టీఆర్ అంటే తమకు గౌరవం ఉందనీ, చంద్రబాబు కంటే తాము ఎక్కువగా ఎన్టీఆర్ ను గౌరవిస్తామని తెలిపారు. తాను ఇంత వరకూ ఎన్టీఆర్ ను అగౌరవపర్చలేదని చెప్పారు. నందమూరి తారక రామారావు పేరు వైసీపీ పలికితే చంద్రబాబుకు నచ్చదనీ, చంద్రబాబు ఆ పేరు పలికితే పైనున్న ఎన్టీఆర్ కు నచ్చదని జగన్ అన్నారు. నటుడిగా, రాజకీయ నేతగా ఎన్టీఆర్ అందరి మన్ననలు అందుకున్నారని అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉండి ఉంటే ఎన్టీఆర్ ఇంకా చాలా రోజులు జీవించి ఉండేవారని పేర్కొన్నారు. రెండో సారి పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉండేవారని అన్నారు.
ఎన్టీఆర్ పై గౌరవం ఉండటం వల్లనే పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా ఆయన పేరు జిల్లాకు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ పేరు మారుస్తారని చెప్పారన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారకులైన వారు నేడు ఆయన కోసం నినాదాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకుని తిరిగే చంద్రబాబు.. ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకు ఇప్పించలేదని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు ఎన్నికలప్పుడే గుర్తుకొస్తుందని అన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ ఉచితంగా కార్పోరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్య శ్రీ పథకంతో పాటు ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులను తెచ్చిన ఘనత దివంగత వైఎస్ఆర్ది అని జగన్ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ పథకం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.
ఏపిలో 11 మెడికల్ కాలేజీలు ఉండగా, ఎనిమిది టీడీపీ ఆవిర్భావం కంటే ముందే ఉన్నాయన్నారు. మూడు మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ హయాంలో వచ్చాయన్నారు. టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా పెట్టలేదన్నారు. ప్రస్తుతం మోర 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. మొత్తంగా ఏపిలో నిర్మాణ దశలో ఉన్న వాటితో కలుపుకుని 28 మెడికల్ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్ఆర్, ఆయన కొడుకు (తన) హయాంలో వచ్చాయని అన్నారు. అలాంటప్పుడు వైఎస్ఆర్ పేరు పెట్టకూడదనడం న్యాయమేనా అని ప్రశ్నించారు. అర్హత దక్కాల్సిన వాళ్లకు క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా అని టీడీపీని జగన్ నిలదీశారు. టీడీపీ హయాంలో ఏదైనా కట్టి ఉంటే దానికి ఎన్టీఆర్ పేరు పెట్టమని వాళ్లు అడిగితే సానుకూలంగా స్పందిస్తానని జగన్ తెలిపారు. బాగా ఆలోచించే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని సీఎం జగన్ వివరించారు.
ఏపి అసెంబ్లీలో ఎన్టీఆర్ వర్సిటీపై రగడ .. సభ కొద్దిసేపు వాయిదా