AP CM YS Jagan: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపి సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి శనివారం లేఖ రాశారు. రాష్ట్రానికి ఆక్సిజన్ కోటా పెంచాలని కోరుతూ సీఎం జగన్ లేఖ రాశారు. జామ్ నగర్ నుండి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నందుకు సీ ఎం జగన్ ధన్యవాదాలు తెలియజేశారు. ఏపికి గతంలో కంటే ఇప్పుడు ఆక్సిజన్ పెంచినందుకు, ఏడు కంటైనర్లు ఇచ్చినందుక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్స్ 30 వేల వరకూ పెంచడం జరిగిందనీ, రోజుకు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవసరమని వివరించారు. ఈ నెల 10 వ తేదీన ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం కావడం వల్ల రాయల సీమ రీజియన్ లోని తిరుపతిలో ప్రాణవాయువు అందక 11 మంది మృత్యువాత పడిన విషయాన్ని ఈ సందర్భంగా మరో సారి గుర్తు చేశారు.
విశాఖ ఆర్ఐఎన్ఎల్ నుండి కేటాయించిన 170 మెట్రిక్ టన్నులకు బదులు వంద మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే వస్తొందని చెప్పారు. తమిళనాడు, కర్నాటక నుండి ఏపికి కేటాయించిన మేర ఆక్సిజన్ రావడం లేదని వివరించారు. దీని వల్ల రాయల సీమలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా ఇబ్బంది కలుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. జామ్ నగర్ నుండి పంపిన 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మరో రెండ రోజులు రాయలసీమలో ఉపయోగపడుతుందన్నారు. రాయలసీమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జామ్ నగర్ నుండి ప్రతి రోజు 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపాలని కోరారు. ఒరిస్సా నుండి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ తెచ్చుకునేందుకు పూర్తిగా కృషి చేస్తున్నామని సీఎం జగన్ లేఖలో వివరించారు.
రాష్ట్రానికి కావాల్సిన 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్ అందుకునేందుకు అధికారుల కు ఆదేశాలను ఇవ్వాలని లేఖలో సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి కోరారు.