ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఎన్నికల సమయంలో, పాదయాత్రలో ఇచ్చిన నవరత్న హామీలన్నీ నెరవేరుస్తానని జగన్ వెల్లడించారు. మేనిఫెస్టోలో పొందుపచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని పూర్తి చేస్తామన్నారు. సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా వివిధ రూపాల్లో అప్పులు తీసుకువచ్చి మరీ సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నేడు తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న జీవ క్రాంతి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో వైఎస్ జగన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు జగన్మోహనరెడ్డికి గొంగడి కప్పి, తాటి ఆకులతో రూపొందించిన గొడుగు, మేక పిల్లను బహుకరించారు.
ఈ పథకం కింద 45 ఏళ్ల నుండి 60 ఏళ్ల లోపు వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తున్నారు. 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణీ గానూ ప్రభుత్వం రూ.1868.63 కోట్లు ఖర్చు చేస్తోంది. ఒక్కొక్క యూనిట్ ఖరీదు రూ.75వేలుగా నిర్ణయించారు. మహిళలకు మెరుగైన జీవనోపాధి, తద్వారా సుస్థిర ఆదాయం లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. మూడు విడతల్లో గొర్లెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, డాక్టర్ సీదిరి అప్పలరాజు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపి అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.