వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు ఎప్పటికైనా తమ వైపే వస్తారని కాంగ్రెస్ కలలు కంటోంది. దళితుల ఓట్లన్నీ మావే అని కాంగ్రెస్ ఏపీ చీఫ్ శైలజానాథ్ ఇటీవల చెప్పటం ఇందుకు నిదర్శనం.
అయితే ఇది జరిగే పనేనా అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఒకప్పుడు దళితులు కాంగ్రెస్ కి కొండంత అండ అన్నది మాత్రం నిజమే.కాంగ్రెస్ కి దళితులకు అవినాభావ సంబంధం ఉంది. మహాత్ముడు వేసిన పునాది అది. హరిజనులను పురజనులుగా మార్చి దేవాలయ ప్రవేశం వారికి కల్పించి అందరివారుగా దళితులను ముందుకు తెచ్చారు. ఇక వారిని స్వాతంత్ర పోరాటంలో కూడా కలుపుకున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ తో దళితుల బంధం పెనవేసుకుపోయింది. ఇక నెహ్రూ, ఇందిరాగాంధీ చేసిన అనేక సామాజిక, సంక్షేమ కార్యక్రమాల వల్ల కూడా దళితులు కాంగ్రెస్ లో అంతర్భాగమయ్యారు.
అటువంటి దళితులను ముందు ఉత్తరాదిన కాంగ్రెస్ కోల్పోయింది, తరువాత దక్షిణాదిన కూడా వారు కాంగ్రెస్ కు దూరమయ్యారు . ఏపీలో చూసుకుంటే వైఎస్సార్ తో పాటే వారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఇపుడు ఆయన కుమారుడు జగన్ వెంట నడుస్తున్నారు. వారికి గట్టి భరోసా ఇచ్చే నేతగా జగన్ ఉండడం వల్లనే వారు అంతా వైసీపీలో కొనసాగుతున్నారు. ఇదీ మన పార్టీ అనుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్సార్ తమ వాడు అని దళితులు భావిస్తారు. అటువంటి దళిత ఓటు బ్యాంక్ ని వెనక్కు రప్పిస్తామని శైలజానాధ్ అంటున్నారు.ఇదెలా సాధ్యమో ఆయనే చెప్పాలి .దళితులు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నట్లయితే 2014,2019 లలో జరిగిన రెండు ఎన్నికల్లో దళితుల ఓట్లు ఎందుకు కాంగ్రెస్ కి పడలేదో ,ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఎందుకు గెలవలేదో శైలజానాథ్ వివరించాలి.
ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ వైఎస్సార్ పోయిన తరువాత సొంత అస్థిత్వాన్ని కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కలలో కూడా కాంగ్రెస్ తో కలవలేని టీడీపీతో చేతులు కలిపి పాలన సాగించారు. ఎన్నో చీకటి ఒప్పందాలు నాడు జరిగాయి. వైఎస్సార్ కుటుంబాన్ని వేధించేలా టీడీపీ చంద్రబాబు కాంగ్రెస్ పన్నిన కుట్రలు నాడు స్వయంగా దళితులు చూశారు, ఇక కాంగ్రెస్ తన రాజకీయం కోసం, మరీ ముఖ్యంగా వైఎస్సార్ కుటుంబాన్ని అణచడానికి ఎందాకైనా వెళ్తుంది. ఎవరితోనైనా చేతులు కలుపుతుంది అని గ్రహించబట్టే దళితులు ఆ పార్టీతో దశాబ్దాల బంధం తెచ్చుకుని వైసీపీలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో శైలజానాధ్ తమ పార్టీ ఓటు బ్యాంక్ దళితులే అని చెప్పుకున్నా వారు కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితి లేదన్నది నిర్వివాదాంశం.ఏ విధంగా చూసుకున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దళితులే దన్నుగా నిలుస్తారు.కాంగ్రెస్ కలలు నిజమయ్యే పరిస్థితే లేదని రాజకీయ పరిశీలకులు ఢంకా బజాయిస్తున్నారు.