కడప: రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, మాజీ ఎంపి గఫూర్లు డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు సమస్యలు ప్రజల వేదనకు గురి చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఇసుక విధానం మార్పుల కారణంగా ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం తగదని వారు అన్నారు. నిర్మాణ రంగానికి ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధి లేక రోడ్డున పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలే రాజధాని వివాదానికి కారణమని వారు పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలోని రైతాంగానికి వెంటనే లీజు, పది వేల రూపాయల వంతున పెన్షన్ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రాజధాని మార్పుపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. నూతన ప్రభుత్వ నిర్ణయం కారణంగా వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న లక్షా 20వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటో తెలియజేయాలని వారు కోరారు. వెనుకబడిన సీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.