అమరావతి : ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వివాదంపై గురువారం హైకోర్టులో జరిగిన విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ హాజరయ్యారు. అనంతరం న్యాయస్థానం శుక్రవారం నాటికి వాయిదా వేసింది.
గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి వైసీపీ పార్టీకి చెందిన రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేశారంటూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థాయం విచారణ నిర్వహించి ఆ రంగులను తొలగించాలని గతంలోనే తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు తీర్పుకు భిన్నంగా ప్రభుత్వం 620 జీవో తీసుకు వచ్చింది. గతంలో రంగులతో పాటు మట్టి రంగును కలిపి వేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు దానిపై కూడా విచారణ చేపట్టి ప్రభుత్వం కోర్టు ధిక్కారణకు పాల్పడినట్లు భావించింది. దీంతో వివరణ ఇచ్చేందుకు సీఎస్ నీలం సాహ్ని నేడు కోర్టుకు హాజరయ్యారు. అయితే ఇదే అంశపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది.