గత వారం లెబనాన్ రాజధాని బీరూట్ లో లెబనాన్ భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఒ గోడౌన్ లో 2700 టన్నులకు పైబడి నిల్వ చేసిన అమోనియం నైట్రేట్ ఒకే సారి పేలింది. ఈ భారీ పేలుళ్లకు ఆ దేశంలో లక్షలాది ఇళ్లు నేలకూలాయి. వేలాది మంది గాయాలపాలయ్యారు. దాదాపుగా 200 మంది వరకు మరణించారు. ప్రపంచంలో అత్యంత విషాదమైన సంఘటనగా దీన్ని పేర్కొనవచ్చు. దీనంతకి కారణం అమ్మోనియం నైట్రేట్ భారీగా నిల్వ ఉంచడమేనని ప్రపంచం గుర్తించింది. ప్రపంచమంతా అలర్ట్ చేసింది.
ఇదే సమయంలో అమ్మోనియం నైట్రేట్ తో మన దేశానికి, మన రాష్ట్రానికి, అందులోను మనకు రాబోతున్న రాజధాని విశాఖకు పెద్ద ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే అమ్మోనియం నైట్రేట్ విశాఖ ఓడరేవు వద్ద భారీగా వేల టన్నుల్లో నిల్వ ఉంటుందని కొన్ని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో అసలు ఈ అమ్మోనియం నైట్రేట్ తో మన రాష్ట్రానికి, కాబోయే రాజధానికి ముప్పు ఉందా? అసలు అక్కడ ఎంత మేరకు నిల్వలు ఉన్నాయి? రాష్ట్రంలో ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది? అనేది కీలకంగా మారింది.
అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే..
అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై 2012లో కొన్ని నిభందనలు రూపొందించారు.
- లైసెన్సు లేకుండా ఎక్కడ కూడా తయారీకి అనుమతి లేదు.
- అనుమతి లేకుండా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించకూడదు.
- నిబంధనలకు లోబడి ఎగుమతులు, దిగుమతులు నిర్వహించాలి.
- లైసెన్స్ కల్గిన గోడౌన్ లలో మాత్రమే నిల్వ ఉంచాలి.
- ఎంపిక చేసిన లైసెన్స్ కల్గిన వారికి మాత్రమే సరఫరా చేయాలి.
- కొనుగోలు చేసిన అమ్మోనియం నైట్రేట్ కు అదనంగా రవాణాకు అనుమతి లేదు.
- వేరొక పేలుడు పదార్ధాలతో కలిపి అమ్మోనియం నైట్రేట్ ను రవాణా చేయరాదు.
- 18 ఏళ్ల లోపు వారిని, అంగవైకల్యం, అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని ఉద్యోగులుగా నియమించకూడదు.
- అనుమతులు లేకుండా ఎక్కడ కూడా బ్లాస్టింగ్ లకు ఉపయోగించరాదు.
- అమ్మోనియం నైట్రేట్ ప్యాకింగ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
ఈ రోజు డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష నిర్వహించారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై అయన పోలీస్ అధికారులతో పాటు వివిధ అధికారులతో మాట్లాడారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, రవాణా, వినియోగం, విక్రయాలకు సంబంధించిన నిబంధనలను ఎస్ పీలకు వివరించారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వ కేంద్రాలు, రవాణా, వినియోగం పై తనిఖీలు నిర్వహించి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన నిభందనలు ఖచ్చితంగా అమలు చేయాలని, అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలకు వెనుకాడ వద్దనీ డీజేపీ సూచించారు.