అమరావతి: ఆత్మకూరులో రెండు వర్గాల మద్య గొడవ జరిగిందే తప్ప రాజకీయ పార్టీలకు సంబంధం లేదని డిజిపి గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో ఉన్న వారందరినీ పోలీసులే స్వయంగా గ్రామాలకు తీసుకువెళ్లారని చెప్పారు. అతి త్వరలో ఆత్మకూరులో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆయన పేర్కొన్నారు. కొందరు నేతలు పోలీసులపై అసభ్యకరంగా మాట్లాడటంపై ఫిర్యాదులు వచ్చాయనీ, వివాదం పెద్దది కాకూడదని సంయమనాన్ని పాటిస్తున్నామని సవాంగ్ తెలిపారు. నిన్న పోలీసులు స్పందించిన తీరు అభినందనీయమని అన్నారు. నాయకులు తిడుతున్నా కూడా పోలీసులు చాలా ఓర్పుగా వ్యవహరించారని సవాంగ్ పేర్కొన్నారు. పోలీసులు ఏకపక్షం అని ఆరోపించడం సరికాదని ఆయన అన్నారు. ఆత్మకూరు బాధితుల లిస్ట్ తెప్పించుకొని పరిశీలన చేశామనీ, బాధితులని చెబుతున్న వారిలో సగానికిపైగా ఇతర ఇబ్బందులతో వచ్చిన వారేనని సవాంగ్ అన్నారు. ప్రతి ఒక్కరి గురించి రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా వివరాలు తెలుసుకుంటున్నారని సవాంగ్ తెలిపారు.
కాగా ఆత్మకూరు బాధితులతో టిడిపి అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. మాజీ సర్పంచ్ ఏసోబుతో పాటు పలువురికి చంద్రబాబు ఫోన్ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తాము ఇళ్లు బాగు చేసుకుంటున్నామని బాధితులు ఆయనకు సమాధానమిచ్చారు. త్వరలోనే తాను ఆత్మకూరుకు వస్తాననీ బాధితులకు టిడిపి అండగా ఉంటుందనీ చంద్రబాబు హామీ ఇచ్చారు.