అమరావతి : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు విజ్ఞప్తిపై డీజీపీ సానుకూలంగా స్పందించారు. దీంతో చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది.
సోమవారం ఉదయం 10 గంటలకు చంద్రబాబు తన కుమారుడు లోకేష్ తో కలసి హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖపట్నంకు చేరుకుంటారు. వెంకటాపురం గ్రామంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. సాయంత్రం రోడ్డుమార్గంలో చంద్రబాబు అమరావతి నివాసానికి చేరుకుంటారు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రెండు నెలలకు పైగా చంద్రబాబు హైదరాబాద్ లో ఉండిపోయిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటన రోజున విశాఖ వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు లభించలేదు. సోమవారం నాటి విశాఖ పర్యటనకు అటు తెలంగాణ, ఇటు ఏపి డీజీపీ అనుమతులు ఇవ్వడంతో సందిగ్థత తొలగిపోయింది.