భారతదేశ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. ఏపీకి సంబంధించి అధికారిక వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. వర్షాలు ఎక్కువగా పడుతూండటంతో స్టేడియంలో నీరు నిలిచింది. దీంతో అధికారులు అప్పటికప్పుడు తారుతో లేఅవుట్ వేసారు. కార్యక్రమానికి మూడు రోజుల ముందునుంచీ ఏర్పాట్లు చేసి ఆగష్టు 15కి అంతా సిద్ధం చేశారు. ఆగష్టు 15న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు స్టేడియంకు వచ్చారు. ఆయనతోపాటు సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంచార్జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈసారి వేడుకలకు సీఎం మాతృమూర్తి విజయమ్మ, భార్య భారతి హాజరయ్యారు. స్టేడియంకు చేరుకోగానే సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
వర్షంలో తడచినా పర్లేదు.. గొడుగు తీసేయండి..
జాతీయ పతాకం ఆవిష్కరణ తర్వాత సీఎంకు అన్ని పోలీస్ బలగాలు గౌరవ వందం సమర్పిస్తాయి. దీనిని స్వీకరించేందుకు సీఎం జగన్ ప్రత్యేకంగా ఓపెన్ టాప్ వాహనాన్ని సిద్దం చేశారు. వాహనం పైకి సీఎం చేరుకున్నారు. ఈ సమయంలో వర్షం ప్రారంభమైంది. సీఎంతోపాటు డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీసు బలగాల చీఫ్, సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా వచ్చారు. అయితే.. వర్షం పడుతూండటంతో సీఎస్ఓ అప్రమత్తమయ్యారు. సీఎం జగన్ పై వర్షం పడకుండా ఆయనకు గొడుగు పట్టారు. గౌరవ వందనం ప్రారంభమవుతూండగా జగన్ తనపై గొడుగు తీసేయాలని సీఎస్ఓతో చెప్పారు. ఏం చేయాలో పాలుపోని సీఎస్ఓ సీఎం చెప్పడంతో గొడుగు తీసేసారు. వాహనంపై స్టేడియం అంతా కలియతిరుగుతూ సీఎం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ క్రమంలో గౌరవ వందనం పూర్తయ్యేసరికి జగన్ పూర్తిగా తడచిపోయారు.
సీఎం సమాధానానికి విస్తుపోయిన డీజీపీ..
గొడుగు తీసివేయటం వల్లే తడచిపోయారు.. అని సీఎం వద్ద డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రస్తావించారు. దీనికి జగన్ ఇచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోవడం డీజీపీ వంతైంది. ‘వందల మంది వర్షంలో తడుస్తూ నుంచుని నాకు గౌరవం ఇస్తున్నప్పుడు నేను మాత్రమే గొడుగు ఆసరతో వెళ్లడం బాగోదు. అంతమంది తడుస్తున్నప్పుడు నేనొక్కడినే తడవటం పెద్ద విషయం కాదు అన్నారు. దీంతో సీఎం జగన్ సింప్లిసిటీ, ఇతరులపై ఉన్న గౌరవానికి డీజీపీ ముగ్దుడైపోయారు. స్వాతంత్ర దినోత్సవం నాడు సీఎం అందరితోపాటే వర్షంలో తడుస్తూ చూపించిన చొరవ.. అందరూ ఒకటే అనే భావం తీసుకురావడంపై ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఉన్నతాధికారులు సీఎం సింప్లిసిటీని ప్రశంసిస్తున్నారు. ’