కరోనా వైరస్ ఉధృతి పెంచింది. దేశవ్యాప్తంగా రోజు వారి కేసుల సంఖ్య పాతిక వేలకు చేరింది. గడచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద 24,600 కేసులు నమోదు కావడం, నిన్న మొన్న కూడా ఇదే సంఖ్యలో కేసులు నమోదు అవ్వడం చూస్తుంటే దేశంలో కరోనా ఉధృతి ఎంత వరకు ఉందో తెలుసుకోవచ్చు. అత్యధికంగా తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పోజిటివిటీ రేటు 25 శాతం వరకు ఉంది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా చాపకింద నీరులా కరోనా వ్యాప్తి చెందింది. ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో తెలియడం లేదు కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని మారుమూల పల్లెల్లో కూడా కరోనా విజృంభిస్తోంది. కర్నూలు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలను కుదిపేస్తోంది. ఈ జిల్లాలో గత నెల రోజులుగా రోజుకు 150 నుంచి 200 కేసు నమోదు కావడం అత్యంత డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ కరోనా విషయంలో వైద్య సిబ్బంది అంతర్లీనంగా మాట్లాడుకుంటున్న ఒక ఆడియో క్లిప్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది.
పరీక్షలు అవసరం లేదు.. నేరుగా ట్రీట్మెంటే
ఓ జిల్లాలోని ఆసుపత్రి వైద్యాధికారిణి సిబ్బంది కి సూచనలు ఇస్తూ కరోనా పరీక్షలు చేయడం టైం వేస్ట్.. ఇక పరీక్షలు చేయవద్దు.. ఆ లక్షణాలు ఉన్న వారికి నేరుగా ఆసుపత్రికి తరలించి యాంటీబాడీస్ ఇచ్చి చికిత్స మొదలు పెట్టండి. అవసరమైన మేరకు మూడు లేదా నాలుగు రోజులు యాంటిబయోటిక్, విటమిన్ సీ, పారాసెటమోల్ వంటి వాటితో ప్రాథమిక చికిత్స మొదలు పెట్టండి. పరీక్షలు అవసరం లేదు. పరీక్షలు చేస్తూ పోతే కాలం గడుస్తుందే తప్ప ట్రీట్మెంట్ అందించలేము. ఈ రోజు పరీక్ష చేయడం, నాలుగైదు రోజుల తర్వాత ఫలితం రావడం, ఆ ఫలితం వచ్చే సమయానికి వైరస్ ముదిరి ఊపిరితిత్తుల్లోకి చేరుకోవడం, అతని మరణం అంచుల దాకా వెళ్లడం, ఇదంతా మనకు అనవసరం, ప్రభుత్వానికి చెప్పినా చెప్పకపోయినా మీరు అయితే నేరుగా కరోనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి. రాష్ట్రంలో పరిస్థితులు ఏమాత్రం బాగో లేదు. ఎంత మంది పైకి వెళ్తారో తెలియదు అంటూ ఆడియో క్లిప్ లో జిల్లా స్థాయి అధికారిణి చెప్పడం రాష్ట్రంలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు వైద్యశాఖలోనే అంతర్లీనంగా కాకుండా ప్రభుత్వంలో కూడా కరోనా పరిస్థితిపై ఎంత గందరగోళంగా ఉందో తెలుస్తోంది.
పరీక్షల్లో టాపే కానీ..
కరోనా పరీక్షల నిర్వహణలో రాష్ట్రం దేశ వ్యాప్తంగా టాప్ త్రీ లో ఉంది. ఇప్పటికే 10 లక్షల పరీక్షలు పూర్తి చేసుకుని, రోజుకు సగటున 35 వేల వరకు కరోనా పరీక్షలు చేస్తోంది. వీటిలో ట్రూనాడ్ కొన్ని వీడిఆర్ఎల్ కొన్ని చేస్తున్నది. అయితే ట్రూనాడ్ పరీక్ష లో పాజిటివ్ వచ్చినవి వీడిఆర్ఎల్ లో నెగిటివ్ రావడంతో గందరగోళం నెలకొంది. తుది ఫలితాలు వచ్చినప్పటికీ వ్యాధి ముదిరి ఊపిరితిత్తులకు చేరుతోంది. అప్పటికీ కాపాడలేక చేతులెత్తేస్తున్నారు. అందుకే గడచిన పది రోజుల్లో రాష్ట్రంలో మరణాలు కూడా చాపకింద నీరులా పెరిగిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి మొదట్లో రాష్ట్రంలో మరణాలు పెద్దగా లేవు కానీ గడచిన పది పదిహేను రోజుల నుంచి రాష్ట్రంలో 150 మంది వరకు చనిపోయారు. ఇది ప్రభుత్వాన్ని కూడా ఆందోళన కలిగిస్తుంది. అందుకే వైరస్ పాజిటివ్ నిర్ధారణ అవ్వకముందే కరోనా ట్రీట్మెంట్ మొదలు పెడితే పోయేదేముంది కాన్న రీతిలో వైద్య సిబ్బంది ఆలోచిస్తూ, ఆ లక్షణాలు ఉన్న అందరికీ ఇకమీదట చికిత్స చేయడానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాదులో కరోనా విజృంభిస్తే చికిత్స అందించడానికి పేరుమోసిన ఆసుపత్రులు నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి వాటితో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన టిమ్స్ కూడా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో అలా చెప్పుకోదగిన హాస్పిటల్స్ ఏమీ లేవు. జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర ఆసుపత్రిలు తప్పితే పెద్ద స్థాయిలో పేరు మోసిన హాస్పిటల్ అయితే ఏమీ లేకపోవడం రాష్ట్రంలో ఆందోళన కలిగించే అంశమే.