అమరావతి: ఎన్ఆర్సిని ఏపిలో వైసిపి ప్రభుత్వం వ్యతిరేకిస్తుందనీ, రాష్ట్రంలో దీన్ని అమలు చేయమనీ డిప్యూటి సిఎం అంజాద్ బాషా స్పష్టం చేశారు. ఎన్ఆర్సిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ముస్లింలు ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎన్ఆర్సిపై ఏపి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కడపలో డిప్యూటి సిఎం అంజాద్ బాషా నివాసాన్ని పెద్ద సంఖ్యలో ముస్లింలు ముట్టడించారు. ఎన్ఆర్సికి పార్లమెంట్లో వైసిపి ఎంపిలు అనుకూలంగా ఎందుకు ఓటు వేశారంటూ ముస్లిం నేతలు డిప్యూటి సిఎంను నిలదీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్సిని అన్ని ఫార్మెట్లో వైసిపి ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం కాదనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకే ఈ ప్రకటన చేస్తున్నామనీ చెప్పారు. రాష్ట్రంలో ఎన్ఆర్సిని అమలు చేయమని డిప్యూటి సిఎం స్పష్టం చేశారు.