AP Esma Act: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరుగనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశం అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళన హాట్ టాపిక్ ఉంది. నూతన పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓ పక్క ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేసినా ప్రభుత్వం మాత్రం నూతన పీఆర్సీ ప్రకారం వేతనాల చెల్లింపునకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు సమ్మె అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నారు.
AP Esma Act: పెరుగుతున్న కరోనా కేసులు
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన మేర వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత కీలక సమయంలో ఎన్జీవోలు సమ్మెలోకి వెళితే తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ పరిస్థితులను బయటపడాలంటే ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించే అవకాశం ఉందని అంటున్నారు. నేడు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపైనా చర్చించే అవకాశాలు ఉన్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పటల్స్, వైద్యులు, నర్సులను ఆరు నెలల పాటు ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ జీవో విడుదల చేసింది.
AP Esma Act: సమ్మెలోకి వెళ్లకుండా నివారించేందుకు
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లకుండా నివారించేందుకు జగన్మోహన రెడ్డి సర్కార్ ఎస్మా ప్రయోగిస్తుందా..? లేదా అన్నది సాయంత్రానికి తేలుతుంది. ఎస్మా అమల్లోకి తీసుకువస్తే ఆరు నెలల పాటు సమ్మె చేయడానికి వీలు ఉండదు. నేటి కేబినెట్ సమావేశంలో కరోనా పరిస్థితులపై సమీక్ష జరపడంతో పాటు ఏజండాలోని కీలక అంశాలపై చర్చించి ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.