అమరావతి: ఒక పక్కన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించలేదని డిజిపి గౌతం సవాంగ్ అంటున్నారు. మరోపక్క తనకు భద్రత కుదించడంపై చంజ్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు భద్రతను కుదించారంటూ వస్తున్న వార్తలపై గౌతం సవాంగ్ సోమవారం స్పందించారు వివరణ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంత కంటే ఎక్కువగానే ఇచ్చామని సవాంగ్ తెలిపారు. అదే సోమవారం చంద్రబాబు తన భద్రతపై హైకోర్టును ఆశ్రయించారు.
అమరావతిలో ‘స్పందన’ కార్యక్రమంలో సవాంగ్ పాల్గొన్నారు. స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని సవాంగ్ అన్నారు. స్పందన కార్యక్రమం పేరుతో ప్రతి ఎస్పి, సిపి కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని సవాంగ్ అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమ కేసుల ఎత్తివేతకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సవాంగ్ తెలిపారు.
రాజకీయ దాడులపై వైసిపి, టిడిపి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని ఆయన చెప్పారు. అయితే వ్యక్తిగత వివాదాలపై కూడా కొంత మంది రాజకీయ ముద్రవేస్తున్నారనీ, వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సవాంగ్ తెలిపారు.