ఫోన్ ట్యాపింగ్ వివాదం ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరడం, మరోవైపు హైకోర్టు మెట్లు ఎక్కడం తెలిసిన సంగతే. ఏపీ సర్కారు ఫోన్ ట్యాపింగ్ కు
పాల్పడుతోందని పేర్కొంటూ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని న్యాయవాది శ్రావణ్ కుమార్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై హైకోర్టు విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. అయితే ఈ విచారణ సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికను ప్రభుత్వ న్యాయవాది నేరుగా ఇరికించారు.
సంచలన ఆరోపణలు….
ఏపీ సర్కారుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి పిటిషన్ దాఖలు చేసిన శ్రావణ్ కుమార్ తన పిటిషన్లో సంచలన వ్యాఖ్యలు పొందుపర్చారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఏపీ సర్కార్ ప్రత్యేకంగా అధికారిని నియమించిందని పిటిషన్లో ఆరోపించారు. రాజకీయ నాయకుల మాదిరిగా న్యాయమూర్తులకు కూడా షాడో పార్టీలను నియమించారని శ్రవణ్ సంచలన విషయాలను తన పిటిషన్లో ప్రస్తావించారు. అయితే ప్రభుత్వ న్యాయవాది ఈ వాదనతో విబేధించారు.
ఆయన ఎవరో చెప్పండి…
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకొని ఏపీ సర్కారు ఫోన్ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసిన అధికారి పేరు చెప్పాలని శ్రావణ్ కుమార్ను కోరింది. దీనికి ఆయన స్పందిస్తూ ప్రత్యేకంగా అఫిడవిట్ దాఖలు చేస్తానని చెప్పారు. అంతే కాకుండా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ఆదేశించింది.
ఆంధ్రజ్యోతిని కూడా ఇన్వాల్వ్ చేయండి
మరోవైపు ఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు అవసరం లేదన్న భావనను వ్యక్తం చేసిన ఏపీ న్యాయవాది తీరును హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే, ఈ విచారణ సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై ప్రభుత్వం న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయదేవతపై నిఘాపేరుతో కథనం రాసిన ఆంధ్రజ్యోతిని కూడా పార్టీని చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు.
చంద్రబాబుకు లేఖ…..
ఇదిలాఉండగా, ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
రాజ్యాంగాన్ని అగౌరవ పర్చేలా, వ్యక్తిగత గోప్యత హక్కును హరించేలా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై చంద్రబాబుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న అంశాలని ప్రస్తావించిన డీజీపీ, ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించిన వివరాలేమైనా ఉంటే సమర్పించాలని కోరారు. అలానే ప్రధానికి రాసిన లేఖలో తీవ్రమైన ఆరోపణలు చేశారని, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగుకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారని అలా ఉల్లంఘనలు జరిగినట్టు ఏమైనా ఆధారాలు దగ్గర ఉంటే సమర్పించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఏపీ డీజీపీ కోరారు. రాజ్యాంగాన్ని, వ్యక్తిగత గోప్యత హక్కును కాపాడేందుకు సిద్దంగా ఉన్నామన్న డీజీపీ పౌరుల హక్కుల పరిరక్షణలో మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు.