ఏపీలో ప్రస్తుతం ‘అమ్మో.. ఒకటో తారీఖు’ అనే సినిమా నడుస్తోంది. ఒక కుటుంబం అంతా కష్టాలు కన్నీళ్లే. ఒకటో తారీఖు వస్తే అప్పులకు వడ్డీలు, ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజు, ఆడపిల్లలను పెంచడం.. వంటివి ఉంటాయి. రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమా ఆద్యంతం కన్నీళ్లు, కష్టాలే ఉంటాయి. ఏపీలో ప్రస్తుతం ఆ స్థాయి కన్నీళ్లు, కష్టాలు లేకపోయినా భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్ధకంగానే ఉంది. సంక్షేమ పథకాల పేరుతో పార్టీలు, నాయకులు పోటాపోటీగా పప్పు, బెల్లాలు పంచినట్టు పంచేస్తూండడంతో ఎప్పటికప్పుడు కొత్త అప్పుల కోసం పరిగెత్తాల్సి వస్తోంది. ప్రస్తతం అదే పిడుగు వేలాడుతోంది.
25వేల కోట్ల అప్పు కోసం తాజా ప్రణాళిక..
ఒకటో తేదీ వచ్చేసింది. సెప్బెంబర్ 1వ తేదీన జీతాలు, పెన్షన్ల కోసం సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వద్ద తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా పాత అప్పులకు వడ్డీలు, జీతాలు, రాయితీలు, పెన్షన్లు, పథకాలు.. వీటన్నింటికీ కనీసం 5వేల కోట్లు అవసరం ఉంది. ప్రతి నెలా 5వేల కోట్లు అప్పుకు వెళ్లేకంటే.. ఒకేసారి 25వేల కోట్లు అప్పు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్’ను అప్పుల కోసం ఏర్పాటు చేసింది. అభివృద్ధి, అప్పులు, రాయితీ.. అనే అంశాలను చేర్చింది. ప్రస్తుతానికి అప్పులు వచ్చేందుకు అన్వేషణ రకరకాల మార్గాల్లో జరుగుతోంది. ఏమార్గంలో అప్పు వచ్చినా తాత్కాలికంగా రాష్ట్రానికి సాయం చేసినట్టే. భవిష్యత్తులో మాత్రం జనంపై పిడుగు ఖాయం.