(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్రంలో ఇక వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు వసూలు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బుధవారం ఈ మేరకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్య, మధ్యతరగతి వాహనచోదకులకు ఈ జరిమానాలు పెనుభారమే అవ్వనున్నాయి. బైక్లు, ఏడు సీటర్ల కార్ల వరకూ ఒకే విధమైన జరిమానాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్ కు రూ.10వేలు, రేసింగ్లో మొదటి సారి పట్టుబడితే రూ.5వేలు, రెండో సారి అయితే రూ.10వేలు, పర్మిట్ లేని వాహనాలు నడిపితే పది వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాల బరువు చెకింగ్ కోసం ఆపకపోతే రూ.40వేలు, ఓవర్ లోడ్తో వెళితే రూ.20వేలు జరిమానా విధించనున్నారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తారు.
పెంచిన జరిమానాలు ..
- వాహన చెకింగ్ విధులకు ఆటంకం కల్గిస్తే రూ.750లు
- సమాచారం ఇవ్వకుండా నిరాకరిస్తే రూ.750లు
- అనుమతి లేని వ్యక్తులకు వాహనం ఇస్తే రూ.5 వేలు
- అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే రూ.5 వేలు
- డ్రైవింగ్ లైసెన్సు పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ.10 వేలు
- నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పు చేస్తే రూ.5వేలు
- వేగంగా వాహనం నడిపితే వెయ్యి రూపాయలు
- సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ రూ.10 వేలు
- రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకున్నా మొదటి సారి రూ.2 వేలు, రెండవ సారి అయితే రూ.5 వేలు
- పర్మిట్ లేని వాహనాలు వాడితే రూ.10 వేలు
- ఓవర్ లోడ్ కు రూ.20వేలు, ఆపై టన్నుకు రెండు వేలు అదనం
- ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు
- అనవసరంగా హారన్ మోగిస్తే మొదటి సారి రూ.1000 రెండవ సారి రూ.2000
- రూల్స్ కు వ్యతిరేకంగా వాహనాలు మార్పు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్ కు, విక్రయించిన వారికి లక్ష