ఏపీలో అమరావతి రాజధాని ఉద్యమం వడి వడిగా ఏకంగా 200 రోజులు పూర్తి చేసుకోగా.. ఆ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ యత్నిస్తోంది. అందులో భాగంగానే రాజధాని విషయంలో బీజేపీని ఇరుకున పెట్టాలని కూడా టీడీపీ యోచిస్తోంది. ఇక ఎట్టి పరిస్థితిలోనూ అమరావతిలో ఉన్న రాజధానిని విశాఖకు తరలించకుండా చూడాలని టీడీపీ యత్నిస్తోంది. అయితే మరోవైపు సీఎం జగన్ మాత్రం విశాఖలో రాజధానిని ఏర్పాటు చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. దీంతో అమరావతి ఉద్యమానికి శాశ్వతంగా చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నారు. అలాగే టీడీపీని రాజకీయంగా మరింత దెబ్బ తీయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
రాజధాని అమరావతిలో ఉండేందుకు సీఎం జగన్ అస్సలు ఇష్టపడడం లేదట. అందుకనే ఆయన విశాఖకు రాజధానిని ఎట్టి పరిస్థితిలోనూ తరలించి తీరాలని చూస్తున్నారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన వైజాగ్ అయితే రాజధానికి అనుకూలంగా ఉంటుందని సీఎం జగన్ ఆలోచన. దీంతోపాటు ఆర్థికంగా కొంత కలసి వస్తుందని జగన్ ఆలోచిస్తున్నారు. అందుకనే జగన్ ప్రస్తుత పరిస్థితిలోనూ అమరావతిని విశాఖకు తరలించాలని పట్టుదలగా ఉన్నారు. ఇక కరోనా సమయం కనుక ప్రస్తుతం ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. దీంతో అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టడం ప్రస్తుతం అసాధ్యమని జగన్ భావిస్తున్నారట. అందుకనే ఆయన రాజధానిని విశాఖకు తరలించాలని చూస్తున్నారు.
ఇక తమకు పరిపాలన రాజధానిగా విశాఖే సరైందని సీఎం జగన్ అటు కేంద్రానికి, ఇటు ఏపీ ప్రజలకు కూడా సరిగ్గా అర్థమయ్యే విధంగా చెప్పనున్నారట. అందుకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను జగన్ తనకు అనువుగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ త్వరలో విశాఖలో రాజధానిని ఏర్పాటు చేసేందుకు వేగంగా ముందుకు సాగుతున్నారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే పరిపాలన రాజధానికి కావల్సిన భవనాలను, ప్రభుత్వ ఉద్యోగులు ఉండేందుకు నివాసాలను వెదుకుతున్నారు.
కాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజాగా విశాఖలో పర్యటించి పోలీసు శాఖకు కావల్సిన భవనాల కోసం వివరాలను అడిగి తెలుసుకున్నారట. అందులో భాగంగానే గౌతమ్ సవాంగ్ విశాఖలోని రిషికొండ, ఐటీ హిల్స్ 2 తదితర ప్రాంతాల్లో ఉన్న భవనాలను పోలీసు శాఖల కార్యాలయాలకు గాను పరిశీలించారని తెలుస్తోంది. అలాగే న్యూ నెట్ సంస్థకు చెందిన ఓ భారీ భవనాన్ని డీజీపీ పరిశీలించారట. అక్కడ ఉన్న సదుపాయాలను ఆయన పరిశీలించినట్లు తెలిసింది. అదే భవనంపై మరో అంతస్థును అదనంగా నిర్మించుకోవచ్చా, లేదా అనే విషయాన్ని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారట.
ఇక తోట్ల కొండలో గ్రే హౌండ్స్ ఉన్న ప్రాంతాన్ని కూడా గౌతమ్ సవాంగ్ పరిశీలించారని సమాచారం. అలాగే జగన్నాథపురంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాలను, సింహపురి లే అవుట్ వెనుక ఉన్న అటవీ భూములను కూడా డీజీపీ పరిశీలించారట. ఈ క్రమంలో డీజీపీకి అటవీశాఖ అధికారులు ఆయా భూములకు చెందిన అన్ని వివరాలను అందజేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ తతంగాన్నంతా పరిశీలిస్తుంటే.. అతి త్వరలోనే విశాఖలో ఏపీ ప్రభుత్వం తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.