ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ బిల్లును మరో సారి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఏడాది చట్టం చేసి కేంద్రానికి పంపినా పలు సాంకేతిక అంశాల నేపథ్యంలో ఆమోదం లభించలేదు. ఈ బిల్లులో రాజ్యంగ ఉల్లంఘనలు ఉన్నాయంటూ కేంద్రం ఈ బిల్లును వెనక్కి పంపింది.
తెలంగాణలో దిశ ఘటన జరిగిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వం ఇలాంటి ఘటనలు నివారణకు కఠినమైన చట్టం అవసరం అని భావించి హుటాహుటిన బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే ఈ బిల్లు కేంద్రం ఆమోదం పొందకముందే రాష్ట్రంలో అమలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్రం ప్రభుత్వం పంపిన దిశ బిల్లులో లోపాలు ఉన్నాయని కేంద్రం వెనక్కు పంపుతూ అనేక సవరణలు సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో సారి సవరణతో దిశ బిల్లును అసెంబ్లీలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టారు. అయితే గత అనుభవాల నేపథ్యంలో ఈ సారి కేంద్రం సూచించిన మార్పులు బిల్లులో చేసినట్లు తెలుస్తోంది.
మహిళలు, చిన్నారులపై వేధింపులు, అత్యాచారాలు వంటి ఘటనల్లో దర్యాప్తును 21 రోజుల్లో పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష విధించేలా దిశ బిల్లును జగన్మోహనరెడ్డి సర్కార్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.