పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు పట్టణ ప్రజలను అంతుచిక్కని వ్యాధి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఈ వ్యాధి గల కారణాలు తెలుసుకునేందుకు సీసీఎంబీ, ఎయిమ్స్, జాతీయ పోషకాహార సంస్థ, ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థల నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఫోన్ చేశారు. ఏలూరులో వ్యాధి గురించి, బాదితుల ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకువచ్చేందుకు గానూ కేంద్ర సంస్థల సహకారాన్ని తీసుకోవాలని గవర్నర్ సీఎంకు సూచించారు. వ్యాధి బారిన పడ్డ వారికి మంచి వైద్యం అందుతుందనే భరోసాను కల్పించడం ద్వారా ప్రజల్లో ఆందోళన తగ్గించాలని సూచించారు.
ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకూ 467 మంది ఈ అంతుచిక్కని వ్యాధి బారిన పడగా, వైద్య సేవల అనంతరం 263 మంది కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయినట్లు గవర్నర్ కు సీఎం జగన్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు పూర్తి స్థాయిలో వైద్యసాయం అందిస్తుందని, తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ, పూణె తదితర ప్రాంతాల నుండి వచ్చిన నిపుణులు బాధితుల బ్లడ్ శాంపిల్స్, బాధితులు వాడుతున్న నీరు, పాలు తదితర శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారని జగన్ తెలిపారు. కేంద్ర సంస్థలు నిర్వహించిన పరీక్షల నివేదికలు ఇంకా అందాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.