ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానుల అంశాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలిసిందే. విశాఖకు రాజధాని తరలించే క్రమంలో న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా హైకోర్టుపై మొదటిసారి కౌంటర్ వేసింది ప్రభుత్వం. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని.. కేంద్రానికి ఇతర పక్షాలకు సంబంధం లేదని అంటోంది. రాష్ట్రాభివృద్ధికి పాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని తన కౌంటర్ లో పేర్కొంది. కేంద్రం కూడా ఈ అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని తేల్చడంతో సుప్రీంలో ఊరట లభిస్తుందని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
కౌంటర్ లో ఏముందంటే..
రాజధాని నిర్ణయం రాష్ట్రానికి సంబంధించిందా? ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎవరు ఏర్పాటు చేయాలన్న అంశానికి సంబంధించిన అఫిడవిట్ ను ఏపీ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసింది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. దీంట్లో రాజధాని ఏర్పాటు సహా అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులపై సమీక్ష అధికారం పూర్తిగా రాష్ట్రాలదే అని పేర్కొంది. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే అని ఇటీవల కేంద్రం తన అఫిడవిట్ లో చెప్పిన విషయాన్ని కూడా ప్రభుత్వం అఫిడవిట్ లో పొందుపర్చింది.
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, రాజధాని తరలింపుపై పిటిషనర్ చెబుతున్న అభ్యంతరాలు పరిగణనలోకి రానివని అఫిడవిట్ లో ప్రభుత్వం పేర్కొంది. విభజన హామీ ప్రకారం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వనంత కాలం విభజన ప్రక్రియ అసంతృప్తిగా ఉన్నట్టుగానే భావించాలని కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇప్పటికీ కేంద్రాన్ని హోదా గురించి అడుగుతూనే ఉన్నామని తెలిపింది. దీంతో అమరావతి ప్రాంతంలోని నిర్మాణాలు, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల తరపున హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై న్యాయవాదుల వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని తీర్పు ఇవ్వనుంది.