PRC: ఏపిలో ఉద్యోగుల పిఆర్సీ ప్రకటన మరింత ఆలస్యం కానుంది. నిన్న ఆర్ధిక సంఘం అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేయడంతో సీఎం వైఎస్ జగన్ న్యూఇయర్ సందర్భంగా గుడ్ న్యూస్ చెబుతారని భావించారు. అయితే పీఆర్సీ విషయంలో పీటముడి వీడలేదు. ఇప్పటికే పీఆర్సీతో సహా వివిధ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిన ఉద్యోగ సంఘాలు.. ఫిట్ మెంట్ పై గట్టిగా పట్టుబడుతున్నాయి.
PRC: వారి హామీతో ఉద్యమానికి విరామం
తమ డిమాండ్ల పరిష్కారానికి నెలాపదిహేను రోజుల క్రితం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలను ప్రారంభించడంతో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఉద్యోగుల సమస్యల విషయంలో ప్రభుత్వం సానుకూల వైఖరితోనే ఉందనీ, ముందుగా ఆందోళన విరమించి సహకరించాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు విజ్ఞప్తి చేయడంతో ఉద్యోగ సంఘాలు తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఓ పక్క మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో ఆ తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు అయితే జరిపారు కానీ ఏకాభిప్రాయం కుదరలేదు.
సీఎంతో అపాయింట్మెంట్ ఇప్పించండి
చివరకు ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో అపాయింట్మెంట్ అయినా ఇప్పించండి అని కోరుతున్నారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. సీఎస్ తో కూడిన అధికారుల కమిటీ 14.29 శాతం ఫిట్ మెంట్ తో పిఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయగా ఉద్యోగ సంఘాలు అంగీకరించలేదు. కనీసం 27 శాతం పైగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులను అవమానించే విధంగా సమావేశాలు జరుగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. చర్చల్లో పురోగతి ఉంటేనే తమను ఆహ్వానించాలనీ లేదా సీఎంతో సమావేశానికి పిలవాలని బొప్పరాజు తెలిపారు.