AP GOVT: ఏపి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ కు షాక్ ఇచ్చే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి. సీఎంఓ అధికారులు చేతులు చేతులు ఎత్తేయడం, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలను అవమానించే రీతిలో మాట్లాడటంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్దమైయ్యారు. చాలా రోజులుగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని వేచి చూశారు. ఇటీవల వరుస సమావేశాలను నిర్వహించిన ఉద్యోగ సంఘాల నేతలు తొలుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో, ఆ తరువాత ఆయన ఆధ్వర్యంలో సీఎంఒ అధికారులతో చర్చలు జరిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి వీరి డిమాండ్ల పై స్పష్టమైన హామీ లభించలేదు. పిఆర్సీ తో పాటు పెండింగ్ డీఏ బకాయిలను చెల్లించాలన్న డిమాండ్ తో వచ్చే నెల నుండి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయనున్నారు. నిరసన కార్యాచరణకు సంబంధించి నోటీసును డిసెంబర్ 1వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మకు ఇవ్వాలని నిర్ణయించారు.
AP GOVT: డిసెంబర్ 7 నుండి తొలి దశ ఉద్యమం
రాష్ట్రంలోని రెండు ప్రధాన జేఏసీలు …ఏపి జేఏసి అమరావతి, ఏపి జేఏసీ నేతలు ఉమ్మడిగా ఉద్యమ కార్యచరణ ప్రకటించాయి. డిసెంబర్ 1వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకూ తొలి దశ కార్యాచరణ ప్రకటించాయి. ఏపి జేెఎసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపి జేఏసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, హృదయరాజు, వైవీ రావు తదితరులు నిరసన కార్యక్రమాలను వెల్లడించారు. డిసెంబర్ 7 నుండి 10వ తేదీ వరకూ అన్ని ఆఫీసులు, స్కూళ్లు, తాలూకా పరిధిలోని ఆఫీసులు, డివిజన్, జిల్లా స్థాయి ఆఫీసులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఏపిఎస్ ఆర్ టీ సీ డిపోల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నారు. డిసెంబర్ 13న అన్ని మండల, డివిజన్ స్థాయిల్లో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, సదస్సులు నిర్వహిస్తారు. డిసెంబర్ 16న ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ ధర్నాలు, డిసెంబర్ 21న జిల్లా స్థాయిలో మహాధర్నాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 27న విశాఖలో సాయంత్రం 4 గంటలకు ఒక ప్రాంతీయ సదస్సు, ఆ తరువాత వరుసగా 30న తిరుపతిలో, జనవరి 3న ఏలూరులో, జనవరి 6న ఒంగోలులో ప్రాంతీయ సభలను నిర్వహించనున్నారు.