అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడు అక్రమ మైనింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సిబిఐకి అప్పగించిన మొదటి కేసు ఇది. గనుల లీజుకు సంబంధించి గురజాల టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవిగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు.
యరపతినేని అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారంటూ పిడుగురాళ్లకు చెందిన కందుర్తి గురవాచారి అనే వ్యక్తి 2015లో కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టుల పలు మార్లు విచారణ జరిగింది. ఇటీవల ఈ అంశంపై వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలిపింది.