ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులు తెరుచుకోవట్లేదు. అయితే.. మద్యం దొరక్క చాలామంది అల్లాడిపోతున్నారు. మద్యం మత్తుకు అలవాటుపడిన వారు వివిధ రూపాల్లో ఆ మత్తును కొని తెచ్చుకుంటున్నారు. శానిటైజర్లు తాగేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గడచిన రెండు మూడు రోజుల్లోనే శాటిటైజర్లు తాగి 20 మంది వరకూ మృతి చెందడం కలకలం రేపుతోంది. మొన్న ప్రకాశం.. నేడు కడప జిల్లా.. ఈ తరహా మరణాలకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. కరోనా కాటు వల్ల సంభవిస్తున్న మరణాల కంటే ఈ మరణాలు మరింత విలయాన్ని సృష్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ మద్యం దుకాణాలు తెరుస్తుందా.. తెరిస్తే మద్యం రేట్లు పెంచుతారా అనే సందేహాలు నెలకొన్నాయి. నిజానికి రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలనేది జగన్ ప్రభుత్వం ఆలోచన. ఇందుకు విడతలవారీగా ప్రణాళికలు వేస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మద్యం రేట్లు భారీగా పెంచడం.. తర్వాత కరోనా వ్యాపించడంతో దుకాణాలు మూసేయడం జరిగింది. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తేవేసిన తర్వాత షాపులు తెరుస్తూనే 75 శాతం ధరలు పెంచింది ప్రభుత్వం. అయితే ఒక్కసారిగా షాపులు తెరవడంతో మద్యం ప్రియులు ఎగబడడం కూడా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మళ్లీ షాపులు మూసేయడంతో మద్యం బాగా అలవాటైన వారు అల్లాడిపోతున్నారు.
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో షాపులు తెరిస్తే కంట్రోల్ చేయలేని పరిస్థితి. షాపులు మూసేస్తే అలవాటును మానుకోలేని వారు ఈ రకంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం మద్యంపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచన చేస్తోందని సమాచారం. మద్యం విషయంలో కొందరు చేస్తున్న పనులకు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ప్రభుత్వంపై మచ్చ కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.