ఏపీలో పన్ను పోటు పెరుగుతోంది. కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్ర సంక్షోభంలో పడ్డ విషయం తెల్సిందే. దాన్నుండి బయటపడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలపై పన్నుల భారం మోపుతోంది.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పై మరోసారి సెస్సు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే జరిగిన మంత్రి వర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు చెరో రూపాయి సెస్సు విధించింది ప్రభుత్వం. దీని ప్రకారంగా రాష్ట్రానికి దాదాపు 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ వచ్చిన ఆదాయాన్ని రోడ్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.