అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయట పెట్టేందుకు జగన్ ప్రభుత్వం దుకుడు పెంచింది. సిఆర్డిఏ పరిధిలో భూములు కొనుగోలు అవకతవకలతో పాటు ఇతర ప్రాజెక్టులపై దర్యాప్తు చేయడానికి ఐపీఎస్ కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.ఈ సిట్ కు విస్తృత అధికారాలనూ కట్టబెట్టింది. రాజధాని పరిధిలో భూ లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ లావాదేవీలతో సంబంధమున్న వ్యక్తులనెవరినైనా విచారణకు పిలిచే అధికారాన్ని దాఖలు పరుస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, అన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఈ సిట్ ను ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టనుంది.