ఓ పక్క ప్రాంతీయ వాదాన్ని విడనాని జాతీయ వాదాన్ని అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్.. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తరుణంలో ఏపి సర్కార్ నుండి ఊహించని పరిణామం ఎదురైంది. తెలంగాణ ప్రభుత్వంపై ఏపి సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమే. పొరుగు రాష్ట్రంతో ఉన్న సమస్యలను పరిష్కరించలేని నాయకుడు దేశంలో ఇతర రాష్ట్రాలకు ఏమి న్యాయం చేస్తాడని ఇతర పార్టీల నేతలు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుంది. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి నాళ్లలో కేసిఆర్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ తర్వాత ఇరువురి మధ్య ఎక్కడ బేధాభిప్రాయాలు వచ్చాయో గానీ గత ఏడాదిన్నర కాలంగా అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏపి ప్రాజెక్టులపై తెలంగాణ, తెలంగాణ ప్రాజెక్టులపై ఏపి సర్కార్ ఫిర్యాదులు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ, ఏపి విభజన జరిగి ఎనిమిదేళ్లు దాటినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన జరగకపోవడంతో ఏపి సర్కార్ ఏకంగా సుప్రీం కోర్టునే ఆశ్రయించింది. రూ.1,42,601 కోట్ల విలువైన ఆస్తులను విభజించకుండా తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తొందని ఏపి ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది.
విభజన జరగాల్సిన ఆస్తులు 91 శాతం హైదరాబాద్ లోనే ఉన్నాయని ఏపీ వాదిస్తొంది. ఆస్తుల విభజనకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదనీ, న్యాయమైన, సమానమైన ఆస్తుల విభజన త్వరగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును ఏపి సర్కార్ కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,21 ప్రకారం ఏపి ప్రజల హక్కులకు తెలంగాణ భంగం కలిగించిందని, ఆస్తుల విభజనకు ఏపి ఎంత ప్రయత్నించినా తెలంగాణ మొండి వైఖరి అవలంబిస్తొందని పిటిషన్ లో ఏపి ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడిచిపోతున్నా ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. వీటి పరిష్కారానికి పలు సమావేశాలను నిర్వహించినా ఫలితం కనబడలేదు. కేంద్ర ప్రభుత్వం పలు దఫాలు ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశాలను నిర్వహించి ఇరువురి వాదనలు వింటున్నదే తప్ప పరిష్కారాలు చూపలేదన్న మాట వినబడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిలా భిడే నిపుణుల కమిటీ 9వ షెడ్యుల్ లోని 90 సంస్థలపై కేంద్రానికి నివేదికలు సమర్పించింది. అయితే ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో ఏపి ఎస్ఆర్టీసీ, డెయిరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్, సివిల్ సప్లైస్ కార్పోరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ తదితర సంస్థలకు సంబంధించి వివాదాలు పరిష్కారం కాకుండా పెండింగ్ లోనే ఉండిపోయాయి.
ఇక పదవ షెడ్యూల్ లోని సంస్థలకు సంబంధించి నగదు నిల్వలను మాత్రమే జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉండగా, ఏపి సర్కార్ దీనికి అంగీకరించకుండా హైకోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం కూడా పెండింగ్ లో ఉండిపోయింది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ సర్కార్ కోరుతున్నది. రెండు రాష్ట్రాలు ఆస్తుల విభజన విభజన విషయంలో ఎవరి వాదనలు వారు వినిపిస్తుండటంతో పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఆయితే కేసిఆర్ బీఆర్ఎస్ పార్టీగా జాతీయ స్థాయి రాజకీయాలు నెరపడం కోసం ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న తరుణంలో ఏపి సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేసిఆర్ ను విమర్శించేందుకు బీజేపీ నాయకులకు మరోక అస్త్రం వచ్చినట్లు అయ్యింది.
హస్తినలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసిఆర్..హజరైన ఇతర పార్టీ నేతలు ఎవరంటే..?