పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరోనా టెస్ట్ లను తక్కువ గా చేస్తున్నారని హైకోర్టు ఆక్షేపించడం, రోజుకు 50 వేల నుండి లక్షకు టెస్ట్ ల సంఖ్య పెంచాలని అక్కడి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. అయితే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలలో ఏ పీ ప్రభుత్వం మాత్రం రికార్డ్ సృష్టించింది. నేటి వరకు కోటి 17 వేల 126 పరీక్షలు నిర్వహించింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం..
గత 24గంటల్లో 54,710మందికి కరోనా పరీక్షలు చేయగా 690 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీనితో మొత్తం పాజిటివ్ నమోదు అయిన కేసుల సంఖ్య 8,67,683కు చేరింది. శనివారం నాడు ఒక్క రోజే 3,787మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీనితో మొత్తం కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 8,52,298కు చేరింది. ప్రస్తుతం 8,397 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా బాధితులలో కొత్తగా ఏడుగురు మృతి చెందగా మొత్తం మృతి చెందిన 6,988కి చేరింది.
ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 93,92,919 చేరుకోగా చికిత్స అనంతరం 88,02,267 మంది కోలుకున్నారు. కరోనా తో లక్షా 36వేల 696 మంది మృతి చెందగా 4,53,956 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.