Eluru Fire Accident: ఏలూరు జిల్లాా అక్కిరెడ్డిపల్లె గ్రామ పరిధిలోని కెమికల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగిన ఆరుగురు మృతి చెందగా మరో 14 మంది గాయపడిన సంగతి తెలిసిందే. అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, ఫ్యాక్టరీ ని అక్కడ నుండి తరలించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఘటనపై తీవ్ర దిగ్భంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించారు.
Eluru Fire Accident: ప్రజలకు హాని కల్గించే పరిశ్రమలను ప్రోత్సహించము
మరో పక్క హోంశాఖ మంత్రి తానేటి వనతి వెంటనే స్పందించి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రజలకు హాని కల్గించే పరిశ్రమలను ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు హాని కల్గించే పరిశ్రమలను ప్రోత్సహించబోమని మంత్రి వనతి చెప్పారు. ప్రజలకు మేలు చేయాలనీ, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న భావనతోనే పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, అవే ప్రజలకు హాని చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
కెమికల్ ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసివేత
అక్కిరెడ్డిపల్లె గ్రామస్తులు కెమికల్ ఫ్యాక్టరీని అక్కడ నుండి తరలించాలని కోరారనీ, దానిపై గంటల వ్యవధిలోనే నివేదిక సిద్ధం చేసినట్లు మంత్రి వనిత తెలిపారు. ఆ నివేదిక ప్రకారం ఫ్యాక్టరీని తాత్కాలికంగా ముసివేసినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.25 లక్షలు, ఫ్యాక్టరీ తరపున మరో రూ.25 లక్షలు మొత్తం రూ.50లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి తానేటి వనిత చెప్పారు.