(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఎట్టకేలకు పదవ తరగతి పరీక్షలకు ముహూర్తం కుదిరింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
కరోనా వైరస్ నేపథ్యంలో 11 పేపర్లను ఆరు పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ ఉదయం 9.30 నుండి 12.45గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి పేపర్కు 100 మార్కులు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అన్ని విధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది.
కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసింది.
జూలై 10న ఫస్ట్ లాంగ్వేజ్
జూలై 11న సెకండ్ లాంగ్వేజ్
జూలై 12న ఇంగ్లీషు
జూలై 13న మ్యాథ్స్
జూలై14న జనరల్ సైన్స్
జూలై 15న సోషల్ స్టడీస్