AP Govt: జగన్మోహనరెడ్డి సర్కార్ గ్రామ పంచాయతీ సర్పంచ్లకు బిగ్ షాక్ ఇచ్చింది. గ్రామ పంచాయతీ అకౌంట్లలోని నగదును వారి అనుమతి, తీర్మానం లేకుండా ప్రభుత్వం ఒక్కసారిగా లాగేసింది. దీంతో రాష్ట్రంలోని సర్పంచ్లు, కార్యదర్శులు ఒక్క సారిగా షాక్ గురైయ్యారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల అయ్యాయి. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయకపోగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను లాగేసుకోవడంపై సర్పంచ్ లు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఆర్ధిక సంఘం నిధులతో పారిశుద్ధ్య పనులు, తాగునీటి పథకాల మరమ్మత్తులు, కార్మికుల జీతాలు, పంచాయతీల అభివృద్ధికి 60 శాతం నిధులు ఖర్చు చేస్తుంటారు. శనివారం సీఎఫ్ఎంఎస్ ఖాతాలతో లింక్ అయిన సర్పంచ్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ చూపడంతో వారు ఒక్క సారిగా షాక్ గురైయ్యారు.
AP Govt: ఆందోళన బాటలో సర్పంచ్లు
గతంలో పలు పంచాయతీలు విద్యుత్ చార్జీల బకాయిలు ఉండటంతో నాడు అనుమతితో 14వ ఆర్ధిక సంఘం నిధుల నుండి మినహాయించి చెల్లించారు. అప్పుడు గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు ఉండటంతో ప్రభుత్వ నిర్ణయానికి వారు అభ్యంతరం చెప్పలేదు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి నూతన సర్పంచ్ లకు చెక్ పవర్ వచ్చిన తరువాత మొట్టమొదటి సారిగా పంచాయతీ తీర్మానం, ఆమోదం లేకుండా ప్రభుత్వం ఉన్న పళంగా లక్షలాది రూపాయలను తీసేసుకోవడంపై సర్పంచ్ లు ఆందోళన చెందుతున్నారు. ఇక గ్రామ పంచాయతీలో పనులు ఎలా జరుగుతాయని మధనపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ లు వ్యతిరేకిస్తున్నారు. విశాఖ ఏజన్సీలోని పెదలబడు (అరకులోయ) మేజర్ గ్రామ పంచాయతీ పాటు సుంకరమెట్ట పంచాయతీ సర్పంచ్ లు, వార్డు సభ్యులు అర్ధనగ్నంగా ప్రదర్శనతో బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నిధులను ఖాళీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామ పంచాయతీ సర్పంచ్ ల సంఘం సమావేశమై కార్యచరణకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు ఏవి..?
మరో పక్క ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు భారీగా ప్రోత్సాహాకాలను ప్రకటించింది. దీంతో చాలా గ్రామాల్లో అభివృద్ధికి నిధులు వస్తాయని భావించి గ్రామ పెద్దలు కూర్చుని ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. 2వేల జనాభాలోపు గ్రామ పంచాయతీలకు రూ.5లక్షలు, 5వేల జనాభా ఉండే పంచాయతీలకు ఏకగ్రీవం అయిన పక్షంలో పది లక్షలు, 5001 నుండి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షలు, పది కన్నా అధికంగా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షలు నగదు ప్రోత్సాహాకాలు అందిస్తామని జగన్ సర్కార్ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఈ నిధులను విడుదల చేయకపోగా పంచాయతీ అకౌంట్ లోని 15వ ఆర్ధిక సంఘం నిధులు ఖాళీ చేయడంపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వం ప్రొసీజర్ ఫాలో కాకపోవడంతో పలువురు గ్రామ పంచాయతీ సర్పంచ్ లు కోర్టును ఆశ్రయించే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం.