SSC Inter Exams: ఏపిలో కరోనా విజృంభిస్తున్న వేళ టెన్త్, ఇంటర్ పరీక్షల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలు, కేంద్రం తీసుకున్న నిర్ణయాల మాదిరిగా పదవ తరగతి పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏపి హైకోర్టులో పరీక్షల విషయంపై దాఖలైన పలు పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ ల వాదనలు విన్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. తదుపరి విచారణను మే మూడవ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
పరీక్షల్లో దాదాపు 30లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములవుతారన్న హైకోర్టు కరోనా బారిన పడిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. కోవిడ్ సోకిన వారు ఐసోలేషన్ లేదా ఆసుపత్రిలో ఉండాలని హైకోర్టు పేర్కొన్నది. అయితే కరోనా బారిన విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు కూడా పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసిన హైకోర్టు.. పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించింది. హైకోర్టు కీలక సూచనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.