(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పులివెందుల కోర్టులో ఉన్న వివేకా హత్య కేసు రికార్డులను సీబీఐ అధికారులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. హత్యకేసు దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ..పులివెందుల కోర్టులో ఉన్న రికార్డుల కోసం ప్రయత్నించారు. అయితే కోర్టులో ఉన్న వివేకా హత్య కేసు రికార్డులను సీబీఐకి అప్పగించడానికి పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ అంగీకరించలేదు. రికార్డులు అప్పగించడానికి తమకు పై నుండి ఉత్తర్వులు ఏమి లేవని చెప్పారు. దీంతో సీబీఐ అధికారులు పదిహేను రోజుల క్రితం ఏపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం..ఈ కేసుకు సంబంధించిన రికార్డులు సీబీఐకి వెంటనే అందజేయాలని పులివెందుల మెజిస్ట్రేట్కు ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు కడప జిల్లా పులివెందులలో గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్యకు గురైన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి..దివంగత సీఎం వైఎస్ఆర్ సోదరుడు, నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చిన్నాన్న కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. హత్య కేసు దర్యాప్తునకు నాడు టీడీపీ హయాంలో నియమించిన సీట్, ఆ తరువాత జగన్మోహనరెడ్డి సీఎం అయిన తరువాత నియమించిన సిట్ బృందాలు వందలాది మందిని విచారించినా అసలైన దోషులను గుర్తించడంలో విఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తెతో సహా పలువురు నేతలు..ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాడు కేసు విచారణ చేసిన హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ బృందం కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నది.