వేరువేరు కేసులో ఏపీ హైకోర్టులో జనసేన నేతలు, జర్నలిస్ట్ అంకబాబుకు రిలీఫ్ ఉత్తర్వులు లభించాయి. విశాఖలో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా విమానాశ్రయం వద్ద మంత్రులు, వైసీపీ నేతలపై జరిగిన దాడి ఘటనను పురస్కరించుకుని జనసేన నేతలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుపై సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ రెండు కేసుల్లో నిందితులకు నేడు హైకోర్టులో రిలీఫ్ లభించింది.
ఏపి సీఐడీ తనపై నమోదు చేసిన కేసుపై జర్నలిస్ట్ అంకబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టును ఆయనను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. గన్నవరం ఎయిర్పోర్టులో బంగారం స్వాధీనం కేసులో ఓ మెసేజ్ వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశారన్న అబియోగంపై కొద్ది రోజుల క్రితం అంకబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టారు. అయితే ఈ కేసులో నిందితుడుకి 41 సీఆర్ పీసీ నోటీసులు ఇవ్వనందున సీఐడీ రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిరస్కరించి విడుదల చేయాలని ఆదేశించారు. దాంతో ఆయన విడుదల అయ్యారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అంకబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అంకబాబు తరపున సీనియర్ న్యాయవాది తోట శ్రీధర్ వాదనలు వినిపించారు. అంకబాబుపై తదనంతర చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. క్వాష్ పిటిషన్ పై వచ్చే నెల 8న పూర్తిస్థాయి వాదనలు వింటామని తెలిపింది.
విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులపై హత్యాయత్నంకు పాల్పడ్డారన్న కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు జనసేన నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జనసేన నేతలు, శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, డాక్టర్స్ సెల్ చైర్మన్ డాక్టర్ రఘులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వారిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. కాగా ఇదే కేసులో అరెస్టు అయి రిమాండ్ లో ఉన్న 9 మంది జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనసేన నాయకులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. 9 మందికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో 71 మందిని పోలీసులు అరెస్టు చేయగా వారిలో 62 మందికి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన 9 మందిపై మోపిన అభియోగాలు తీవ్రమైనవి కావడంతో వారికి బెయిల్ లభించలేదు. వారిని రిమాండ్ కు తరలించారు. తాజా ఈ తొమ్మిది మంది హైకోర్టును ఆశ్రయించగా వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం విశాఖ జైలులో ఉన్న జనసేన నేతలు కోర్టు ఆదేశాలు అందగానే విడుదల కానున్నారు.
జనసేన నేతలకు హైకోర్టు లో బెయిల్ లభించడం పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా హత్యాయత్నం కేసులను బనాయించిందని ఆరోపించారు. వారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరమని తెలిపారు. తాము ఎప్పుడూ న్యాయ వ్యవస్థను సంపూర్ణంగా విశ్వసిస్తామని చెప్పారు. ఆ నమ్మకంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని పవన్ చెప్పారు. గౌరవ హైకోర్టు కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు పవన్ కళ్యాణ్.